|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 07:30 PM
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పార్టీ ఫిరాయింపుల పర్వం, మరోవైపు అనర్హత వేటు భయం మధ్య సాగుతున్న ఈ రాజకీయ చదరంగంలో తాజాగా ‘ఫ్లెక్సీల నిరసన’ ఒక కొత్త మలుపు తిరిగింది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చుట్టూ ఇప్పుడు అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆయన అనుసరిస్తున్న రాజకీయ వైఖరి అని విశ్లేషకులు భావిస్తున్నారు.
నియోజకవర్గంలోని తిరుమలనాథ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి కడియం శ్రీహరి విచ్చేస్తున్న తరుణంలో.. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) శ్రేణులు ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేశాయి. సాధారణంగా పార్టీ మారిన నాయకుడిని విమర్శిస్తూ నినాదాలు చేస్తారు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం’ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.
ఈ ఫ్లెక్సీలలో ఒకవైపు కడియం శ్రీహరి, మరోవైపు ఆయన ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫోటోలను ముద్రించడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. ‘నువ్వు ఇంకా మా పార్టీలోనే ఉన్నానని సభాపతికి చెప్పావు కదా.. అందుకే మా పార్టీ ఎమ్మెల్యేగానే నిన్ను గౌరవిస్తాం’ అంటూ వ్యంగ్యంగా ఈ నిరసన చేపట్టారు.
కడియం శ్రీహరి చుట్టూ జరుగుతున్న ఈ గందరగోళానికి పునాది ఆయన శాసనసభ స్పీకర్కు సమర్పించిన వివరణలో ఉంది. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరానని బహిరంగంగా ప్రకటించినప్పటికీ.. ఇంకా భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతున్నానని ఆయన లిఖితపూర్వక అఫిడవిట్ ఇచ్చారు. ఈ ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు ప్రయత్నించినప్పుడు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ‘మా పార్టీ ఎమ్మెల్యేకు మేం ఫ్లెక్సీలు కట్టుకుంటే మీకెందుకు అభ్యంతరం?" అని బీఆర్ఎస్ నాయకులు పోలీసులను ప్రశ్నించడం గమనార్హం. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు పలువురు నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీనిపై ఇప్పటి వరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి గానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు గానీ స్పందించలేదు.