|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 07:37 PM
సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల చట్టపరమైన అంశాల్లో ఊరట లభిస్తోంది. ఆయనపై నమోదైన పలు రకాల కేసులను న్యాయస్థానాలు కొట్టేస్తున్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు అతనిపై నమోదైన కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిపై ఒక కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చిన ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె. లక్ష్మణ్, ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. ఈ నిర్ణయం రేవంత్ రెడ్డికి ఊరట కల్పించింది.
గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన రెండు కేసులు న్యాయస్థానం కొట్టి వేసింది. నల్గొండలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు.. కౌడిపల్లి పీఎస్లలో మరో కేసు నమోదయ్యాయి. వాటిని రద్దు చేస్తూ నెల రోజుల క్రితం కోర్టు తీర్పు ఇచ్చింది. 2021లో ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనల్లో ఆయనపై నమోదైన రెండు కేసులను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. జులై 26న స్వయంగా విచారణకు హాజరైన ముఖ్యమంత్రి, తన తరపు న్యాయవాదుల వాదనలతో కోర్టును సంతృప్తి పరిచారు. అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత, న్యాయస్థానం ఈ కేసులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. తాజాగా ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికి చట్టపరమైన ఇబ్బందులు దాదాపు తొలగిపోయానే చెప్పాలి.
అదేవిధంగా.. రేవంత్ రెడ్డిపై దాఖలైన మరో కేసులో సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో రేవంత్ రెడ్డిపై పిటిషన్ వేసిన వ్యక్తి పెద్దిరాజుకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఈ కేసును గతంలోనే తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కానీ, పెద్దిరాజు ఈ కేసును నాగ్పూర్ బెంచ్కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమి భట్టాచార్యపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయమూర్తికి క్షమాపణలు చెప్పాలని, వారం రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని పెద్దిరాజును ఆదేశించింది. ఈ పరిణామం రేవంత్ రెడ్డికి పరోక్షంగా సానుకూలంగా మారింది.
మొత్తంగా.. ఈ తీర్పులు, వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి చట్టపరంగా లభించిన విజయాన్ని సూచిస్తున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలను సజావుగా నిర్వహించడానికి ఈ క్లీన్చిట్ దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడటంతో, రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో పాలనపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.