|
|
by Suryaa Desk | Sun, Aug 10, 2025, 06:04 AM
భాగ్యనగరాన్ని శనివారం రాత్రి కూడా భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కారణంగా నగరం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెద్ద అంబర్పేట్ నుంచి ఎల్బీనగర్ మీదుగా నగరంలోకి వచ్చే మార్గాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.శనివారం సాయంత్రం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, వనస్థలిపురం, నాగోల్, ఉప్పల్, ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి నగర్ వంటి శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాదర్గుల్లో 80 మి.మీ., హయత్నగర్లో 75 మి.మీ. చొప్పున వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.ఈ భారీ వర్షానికి సైదాబాద్లోని రెడ్డి కాలనీ పూర్తిగా నీట మునిగింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భాగ్యలత వద్ద కూడా రోడ్డుపై నీరు నిలవడంతో వాహనాలు నత్తనడకన కదిలాయి.నగరంలోని సికింద్రాబాద్, తార్నాక, అమీర్పేట్, కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్ సహా దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో వర్షం ప్రభావం చూపింది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో అనేక చోట్ల జనజీవనం స్తంభించింది. సమాచారం అందుకున్న అధికారులు, సహాయక చర్యలు చేపట్టి, వరద నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు