|
|
by Suryaa Desk | Mon, Oct 27, 2025, 06:19 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీఆర్ఎస్కు ఒకరకంగా ఫైనల్ పరీక్ష వంటిదని మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ఈ ఎన్నికతో ఆ పార్టీ భవిష్యత్తు తేలిపోతుందని అన్నారు. సోమవారం ఆమె ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాతతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.శోభారాణి మాట్లాడుతూ, "అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను చావుదెబ్బ కొట్టారు. ఇప్పుడు ఆ నేతలు జూబ్లీహిల్స్లో సానుభూతి ఓట్ల కోసం డ్రామాలు ఆడుతున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇంకా ఆ బాధ నుంచి తేరుకోకముందే, ఆమెను బలవంతంగా ఎన్నికల బరిలోకి దించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. పదేళ్ల పాలనలో ప్రజలను పట్టించుకోని బీఆర్ఎస్కు ఓటమి తప్పదు" అని విమర్శించారు. గతంలో పీజేఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి ఎదురుచూసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.బీఆర్ఎస్లో మహిళలకు ఏమాత్రం గౌరవం లేదని శోభారాణి ఆరోపించారు. "పదేళ్లలో ఏ మహిళకు సరైన పదవి, ప్రాధాన్యత ఇవ్వలేదు. సొంత ఇంటి ఆడబిడ్డ కవితనే ఇంటి నుంచి గెంటివేసినప్పుడే ఆ పార్టీలో మహిళల పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. కేవలం రాజకీయాల కోసమే బీఆర్ఎస్ నాటకాలు ఆడుతోంది" అని ఆమె మండిపడ్డారు.