|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 02:48 PM
పార్కును కబ్జా చేసి.. బై నంబర్లు సృష్టించి సొంతం చేసుకునే ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. కొండాపూర్లాంటి ఖరీదైన ప్రాంతంలో ఏకంగా 2000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా శుక్రవారం కాపాడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని రాఘవేంద్ర కాలనీలో పార్కుతో పాటు.. కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 2 వేల గజాలను లే ఔట్లో చూపించారు. పార్కు స్థలం ఖాళీగా కనిపించడంతో అక్కడ కొంతమంది కబ్జాకు ప్రయత్నించారు. బై నంబర్లు సృష్టించి 10 ప్లాట్లు చేసేశారు. ప్రతి ప్లాట్లో ఒక షెడ్డు వేశారు. ఈ విషయమై రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధుల నుంచి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందింది. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాలతో హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖలతో కలిసి పరిశీలించారు. పార్కుతో పాటు.. కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలంగా నిర్ధారించారు. కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారి ఆదేశాల మేరకు ఆక్రమణలను శుక్రవారం తొలగించారు. ఆ వెంటనే ఫెన్సింగ్ వేసి పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు పేర్కొంటూ బోర్డులు ఏర్పాటుచేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పార్కు స్థలం విలువ దాదాపు రూ. 30 కోట్ల వరకూ ఉంటుందని పేర్కొన్నారు.
హైకోర్టు ఆర్డర్తో ఆగిన అనుమతులు..200ల గజాల చొప్పున 10 ప్లాట్లుగా బై నంబర్లు సృష్టించి కబ్జా చేయడమే కాకుండా.. వాటిని రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. భవన నిర్మాణానికి అనుమతులు కూడా మంజూరయ్యాయి. ఇంతలో హైకోర్టు ఆదేశాలతో భవన నిర్మాణ అనుమతులను జీహెచ్ ఎంసీ వెనక్కి తీసుకుంది. అలాగే రెగ్యులరైజేషన్ను కూడా రద్దు చేసింది.