|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 08:00 PM
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, బీఆర్ఎస్ ఒకే స్థానానికి ఇద్దరితో నామినేషన్లు దాఖలు చేయించింది.జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పేరును పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది. ఆమె పార్టీ తరఫున మూడు సెట్ల నామినేషన్లను కూడా దాఖలు చేశారు. అయితే, ఊహించని పరిణామాలు ఎదురైతే పార్టీకి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ అధిష్ఠానం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దివంగత నేత పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్ధన్రెడ్డితో కూడా పార్టీ తరఫున నామినేషన్ వేయించింది. సాంకేతిక కారణాలతో లేదా ఇతర అభ్యంతరాల వల్ల సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే, పార్టీ తరఫున అభ్యర్థి లేకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకే ఈ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.