|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 08:13 PM
అల్లుళ్లకు మర్యాద చేయడంలో గోదారొళ్ల స్టైలే వేరు. కానీ, ఇప్పుడు ఈ ట్రెండ్ తెలంగాణకు కూడా పాకింది. కొత్త అల్లుడు పండగకి ఇంటికి వస్తే.. రకరకాల వంటకాలతో విందు ఏర్పాటు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణలో ఓ చోట దసరా పండగకు విందు భోజనంతో పాటుగా తులం బంగారం కూడా దక్కించుకున్నాడు ఓ అల్లుడు. అదేలా అంటే.. దసరా పండుగకు కొత్త అల్లుడు ఇంటికొస్తున్నాడని.. అతడికి విందు ఇవ్వాలని ఆ అత్తామామలు నిర్ణయించుకున్నారు. కూతురు, అల్లుడు కోసం ఏకంగా 101 రకాల ఆహారపదార్థాలతో విందు ఏర్పాటు చేశారు. ఇది చూసి ఆ అల్లుడు ఆశ్చర్యపోయాడు.
అయితే, ఇక్కడే ఒక గమ్మత్తైన విషయం చోటు చేసుకుంది. విస్తరిలో 101 వంటకాలకు ఒక్కటి తగ్గినా ఏమిస్తారని అత్తా-మామల్ని.. అల్లుడు సరదాగా అడిగాడు. 101 రకాలకు ఒక్కటి తగ్గినా.. తులం బంగారం పెడతామని వారు సవాల్ చేశారు. దీంతో ఆ అల్లుడు పోటీ పడి మరి.. ఒకటికి రెండుసార్లు లెక్కపెట్టాడు. అందులో వంద మాత్రమే ఉండటంతో అటు భోజనంతో పాటు ఇటు తులం బంగారం దక్కించుకున్నాడు.
ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. రెండు నెలల కిందట గుంత సురేశ్, సహనల కూతురు సింధు వివాహాన్ని తిరుపతిలో జరిపించారు. వారి వివాహమైన తర్వాత వచ్చిన తొలి పండుగ దసరా కావడంతో.. వరంగల్ నుంచి పండగకు అల్లుడు నిఖిత్ అత్తారింటికి వచ్చాడు. దీంతో కొత్త అల్లుడి కోసం భారీ విందు ఏర్పాటు చేశారు. 101 వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. దీనిలో తెలంగాణకు చెందిన 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, అన్నంతో కలిపి 10 రకాలతో భోజనాన్ని వడ్డించారు. కానీ, 101 రకాలకు ఒక్కటి తగ్గడంతో ఆ తెలివైన అల్లుడు విందు భోజనంతో పాటు బంగారాన్ని కూడా దక్కించుకున్నాడు. ఈ వార్త తెలిసిన వారు లక్కంటే నీదే బ్రో.. విందుతో పాటు బంగారం కూడా సంపాదించుకున్నావ్.. కొత్త పండగకు కొత్త అల్లుడు లక్కీ ఛాన్స్ కొట్టేశాడు.. విందు హైలెట్.. గోల్డ్ గెలవడం ఇంకా హైలెట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈవార్త తెలిసిన వారు.