|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 07:38 PM
తెలంగాణవాసులకు అధికారులకు కీలక అలర్ట్ జారీ చేశారు. మరొక్క రోజు మాత్రమే అవకాశం ఉందని.. ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోతే.. 5 లక్షల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలోని అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకు అధికారులు జారీ చేసిన అలర్ట్ దేని గురించి.. దీనికి అర్హులు ఎవరు వంటి వివరాలు మీకోసం..
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంట నష్టపోతే.. రైతులను ఆదుకోవడం కోసం పసల్ బీమా యోజన.. పంటలకు కనీస మద్దతు ధరతో పాటుగా దురదృష్టవశాత్తు రైతు చనిపోతే.. అతడి కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం కోసం రైతు బీమా వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే పంటల సాగు కోసం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రూ.9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈక్రమంలో ప్రభుత్వం తాజాగా రైతు బీమా పథకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దురదృష్టవశాత్తు ఎవరైనా రైతు చనిపోతే.. వారి కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి అప్లై చేసుకునేందుకు కొత్త వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొత్త వారు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 13ను చివరి తేదీగా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు.. అలానే గతంలో పాస్ బుక్కులు ఉన్నా.. ఈ పథకంలో చేరని వారు.. ఆగస్టు 13వ తేదీలోపు అప్లై చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
2018 ఆగస్టు 14న ప్రారంభమైన రైతు బీమా పథకం , రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా.. ఒకవేళ ఎవరైనా రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే.. అతని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తారు. రైతు సహజంగా మరణించినా.. ప్రమాదవశాత్తు చనిపోయినా సరే ఈ పథకం వర్తిస్తుంది. ఈ బీమా మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రైతులు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అవి.
రైతు బీమా దరఖాస్తు ఫారం,
పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ లేదా ఎమ్మార్వో డిజిటల్ సంతకంతో కూడిన డీఎస్ పేపర్,
రైతు ఆధార్ కార్డు,
నామినీ ఆధార్ కార్డు
ఈ పథకానికి దరఖాస్తు చేసే రైతు వయసు 18-59 ఏళ్ల మధ్య ఉండాలి. ఈపథకంలో భాగంగా ప్రభుత్వం రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా ప్రీమియం వసూలు చేయదు. సర్కారే రైతుల ప్రీమియం మొత్తాన్ని ఎల్ఐసీకి చెల్లిస్తుంది. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే.. బీమాగా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తుంది.