|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 06:35 PM
తెలంగాణ యువత దేశంలోనే అత్యుత్తమ స్థానానికి ఎదగాలని.. రాష్ట్ర గౌరవాన్ని పెంచాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. హైదరాబాద్లో జరిగిన ‘రాజీవ్ సివిల్ అభయహస్తం’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యువతే తెలంగాణకు బలమైన మానవ వనరులని, వారి కృషి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.
సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను ప్రోత్సహించడానికి.. వారికి ఆర్థికంగా అండగా నిలవడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. సివిల్స్-2025 మెయిన్స్కు ఎంపికైన 178 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను భట్టి విక్రమార్క అందించారు. ఈ ఆర్థిక సహాయం విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలపై దృష్టి పెట్టడానికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. అలాగే.. సివిల్స్-2024 విజేతలను ఈ సందర్భంగా సన్మానించి.. వారి విజయాలను ప్రశంసించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు సమాజాభివృద్ధి కోసం, పేదల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారులు చిత్తశుద్ధితో.. నిబద్ధతతో పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. ‘మానవత్వం’ అనే కోణంలో పేదల జీవితాల్లో మార్పు తీసుకువస్తేనే మన జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుందని అన్నారు. సమాజంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఒక అవకాశంగా భావించి.. దానిని సమాజ అభివృద్ధికి ఉపయోగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యువ ఐఏఎస్ ఆఫీసర్లకు సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం ఇదే..
ఈ పథకం ద్వారా తెలంగాణ నుంచి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు సివిల్ సర్వీసెస్లో విజయం సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. యువత తమ కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని, తద్వారా తెలంగాణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టాలని ఆయన కోరారు.