|
|
by Suryaa Desk | Sun, Aug 10, 2025, 08:18 PM
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు శుభవార్త. ఇకపై ఇంటి నిర్మాణ పురోగతి, బిల్లుల చెల్లింపు వంటి సమగ్ర వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వం పారదర్శకతను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్లు వెబ్సైట్లో మార్పులు చేసి, లబ్ధిదారుల సమాచారాన్ని నేరుగా చూసుకునే వీలు కల్పించినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ సౌకర్యం వల్ల లబ్ధిదారులు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కార్యాలయాల చుట్టూ తిరిగేందు సమయం, డబ్బులు వృథా అవుతుండగా.. ఆ సమస్యకు చెక్ పెట్టేందుకు వెబ్సైట్లో మార్పులు చేశారు.
ప్రజల సౌకర్యార్థం ఈ వెబ్సైట్లో సమాచారం తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంచారు. దీనివల్ల భాషాపరమైన సమస్యలు లేకుండా ప్రజలు సులభంగా తమ వివరాలను తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 లక్షల ఇళ్లను ఇందిరమ్మ పథకం కింద మంజూరు చేయగా.. వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మార్క్ అవుట్, పునాదులు, గోడలు, స్లాబ్ వంటి నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగానే లబ్ధిదారులకు నాలుగు విడతలుగా రూ.5 లక్షల ఆర్థిక సాయం విడుదల చేస్తున్నారు.
తమ ఇంటి నిర్మాణ బిల్లు ఏ స్థాయిలో ఉంది? ఏ అధికారి వద్ద ఆగిపోయింది? వంటి వివరాల కోసం లబ్ధిదారులు గతంలో హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాలు, కలెక్టరేట్లు, ఎంపీడీవో కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ సమాచారం అంతా ఆన్లైన్లోనే లభిస్తుంది. బిల్లు ఏ కారణంతో ఆగిపోయిందో కూడా తెలుసుకునే వీలు ఉండటంతో, లబ్ధిదారులు ఆ లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.
ఆన్లైన్లో వివరాలు చెక్ చేయడం ఎలా?
లబ్ధిదారులు తమ వివరాలు తెలుసుకోవడానికి https://indirammaindlu.telangana.gov.in/ అనే వెబ్సైట్ను సందర్శించవచ్చు.
వెబ్సైట్లో ‘అప్లికేషన్ సెర్చ్’ బటన్పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ‘సెర్చ్ బై’ ఆప్షన్లో ఆధార్ లేదా మొబైల్ నెంబర్ వంటి వివరాలను ఎంచుకోవాలి.
వివరాలు నమోదు చేయగానే, స్క్రీన్పై లబ్ధిదారుని పూర్తి సమాచారం, ఇంటి నిర్మాణ పురోగతి, బిల్లుల చెల్లింపు తేదీలు, చెల్లించిన మొత్తం వంటి వివరాలు కనిపిస్తాయి.
అంతేకాకుండా, లబ్ధిదారుల సమాచారంలో ఏవైనా లోపాలు ఉంటే, అవి కూడా వెబ్సైట్లో కనిపిస్తాయి.
లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసుకోవాలని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు.