|
|
by Suryaa Desk | Sun, Aug 10, 2025, 06:39 PM
సమావేశం ఏదైనా.. ఎక్కడా తడబడకుండా.. ఉన్నది ఉన్నట్లు చెప్తూ.. ప్రజల్లో తనదైన శైలిలో గుర్తింపు పొందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. శనివారం రాఖీ పండుగ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని.. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నానని చెప్పిన మల్లారెడ్డి, ఇప్పుడు మాట మార్చారు. ఆదివారం జవహర్నగర్లో మీడియాతో మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని అనలేదని స్పష్టం చేశారు. ఈ గందరగోళానికి కారణం ఏమిటనేది ఇప్పుడు అందరిలో ప్రశ్న.
మల్లారెడ్డి ప్రస్తుత వ్యాఖ్యలు ఇవి..
తాను రాజకీయాలకు గుడ్బై చెబుతానని అనలేదని.. తన మిత్రుడితో జపాన్లో ఎలాగైతే ఉద్యోగాలకు రిటైర్మెంట్ ఉండదో, అలాగే రాజకీయాలకు కూడా రిటైర్మెంట్ ఉండదని మాత్రమే చెప్పానని మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. చివర్లో తాను చెప్పిన మాట ఏదో అలా ఫ్లోలో వచ్చింది తప్ప.. కావాలని చెప్పింది కాదన్నారు.
తాను ప్రస్తుతం బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని.. ఇతర పార్టీలైన టీడీపీ లేదా బీజేపీలో చేరే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. తన పూర్తి దృష్టి విద్యాసంస్థల స్థాపన, వాటి నిర్వహణపైనే ఉంటుందని ఆయన అన్నారు. అయితే.. శనివారం చెప్పిన "మూడేళ్లు రాజకీయాల్లో ఉంటా, ఆ తర్వాత రాజకీయమే వద్దనుకుంటున్నా" అనే వ్యాఖ్యలకు, నేడు చెప్పిన మాటలకు చాలా వ్యత్యాసం ఉంది.
మల్లారెడ్డి ఇలా మాట మార్చడానికి రాజకీయ వర్గాల్లో పలు కారణాలు వినిపిస్తున్నాయి. మల్లారెడ్డి లాంటి బలమైన ప్రజా నాయకుడు పార్టీ నుంచి తప్పుకుంటానని ప్రకటించడం బీఆర్ఎస్కు ఇబ్బందికరమైన పరిస్థితి. దీనివల్ల ఆయనపై పార్టీ అధిష్ఠానం నుంచి ఒత్తిడి వచ్చి ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన విద్యా సంస్థలకు సంబంధించిన వ్యాపారాలు సజావుగా కొనసాగడానికి, భవిష్యత్తులో కూడా రాజకీయంగా పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఆయన ఈ మాట మార్చి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇతర పార్టీల్లో చేరనున్నట్లు వస్తున్న ఊహాగానాలను కట్టడి చేయడానికి, ప్రస్తుతానికి బీఆర్ఎస్లో తన స్థానం పదిలం చేసుకోవడానికి ఇది ఒక రాజకీయ ఎత్తుగడ కూడా కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి.. మల్లారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో గందరగోళానికి దారితీశాయి. ఆయన నిజంగానే రాజకీయాల నుంచి వైదొలుగుతారా లేక కొనసాగుతారా అనేది చూడాలి.