![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:14 PM
సాధారణంగా ఏ ఇంటి యజమాని అయినా.. లేదా షాపు యజమాని అయినా తమ స్థలాన్ని అద్దెకు ఇస్తే ప్రతి నెలా అద్దె వసూలు చేసుకుంటారు. ఒకవేళ అద్దెదారులకు ఏమైనా ఇబ్బందులుంటే, ఒకటి లేదా రెండు నెలలు అద్దె చెల్లించకుండా వెసులుబాటు కల్పిస్తారు. కానీ.. ఇక్కడ మాత్రం విచిత్రంగా ఏకంగా 38 నెలల పాటు అద్దె చెల్లించకుండా ఉండటం సంచలనం రేపుతోంది. ఇలాంటి పరిస్థితి ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఎదురవడం చర్చనీయాంశంగా మారింది.
రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సోమవారం (జులై 7) ఊహించని విధంగా తాళం పడింది. గత 38 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో బిల్డింగ్ యజమాని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఉదయం కార్యాలయం తెరిచే సమయంలో డోర్లకు తాళాలు వేయడంతో, విధులకు వచ్చిన సిబ్బంది, అధికారులు, అలాగే రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చిన ప్రజలు కార్యాలయం బయటే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బిల్డింగ్ యజమాని మాట్లాడుతూ.. తాను సుమారు 15 సంవత్సరాల క్రితం తన భవనాన్ని అబ్దుల్లాపూర్మెట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి అద్దెకు ఇచ్చానని, అయితే గత 38 నెలలుగా అద్దె చెల్లించడం లేదని వాపోయారు. అద్దె బకాయిల సమస్యను పలుమార్లు జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లానని.. అయినప్పటికీ వారి నుంచి ఎటువంటి స్పందన లభించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తాళం వేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వృత్తిరీత్యా మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, ఈ బిల్డింగ్పై లోన్ ఉందని.. ప్రతి నెలా EMIలు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని ఆయన వివరించారు. బిల్డింగ్ యజమాని సబ్ రిజిస్ట్రార్కు రాసిన లేఖలో తన డిమాండ్లను స్పష్టం చేశారు. పేరుకుపోయిన పెండింగ్ రెంట్ మొత్తాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని.. అలాగే నాలుగు నెలల్లోగా భవనాన్ని ఖాళీ చేయాలని కోరారు. తనకు అద్దె బకాయిలు చెల్లించకపోతే, చట్టపరంగా ముందుకు వెళ్తానని కూడా యజమాని హెచ్చరించారు.
ఈ ఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్లక్ష్యానికి, నిధుల నిర్వహణలో లోపాలకు అద్దం పడుతోంది. అద్దె బకాయిలు చెల్లించకుండా ఉండటం.. అది కూడా ప్రభుత్వ కార్యాలయమే ఇలాంటి పరిస్థితులను సృష్టించడం కాస్త ఆశ్చర్యకరమే అని చెప్పాలి. ఈ సంఘటన వల్ల ప్రజలు తమ పనులు చేసుకోలేక తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.