|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 03:23 PM
కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్ధతకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలోని హైడ్రా తీసుకుంటున్న చర్యలే కారణమంటూ వస్తున్న ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. మార్కెట్ నెమ్మదించడానికి అసలు కారణాలు వేరే ఉన్నాయని, కేవలం తమపై నిందలు మోపడం సరికాదని స్పష్టం చేశారు.ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్కు మించి సప్లై ఉందని రంగనాథ్ వివరించారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, ఫ్లాట్లు భారీ సంఖ్యలో పేరుకుపోయాయని ఇది మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. దీనికి తోడు, అమెరికా వంటి విదేశాల నుంచి వచ్చే ఎన్నారై పెట్టుబడులు, రెమిటెన్స్లు గణనీయంగా తగ్గిపోయాయని ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు పోతాయనే భయాలు కూడా కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు."ప్రతిదానికీ హైడ్రాను బాధ్యుల్ని చేయడం ఒక బ్లేమ్ గేమ్లా మారింది. మా కార్యకలాపాలు కేవలం హైదరాబాద్కే పరిమితం. మరి ఖమ్మం, వరంగల్ వంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఎందుకు నెమ్మదించింది ఈ అంశాన్ని కూడా గమనించాలి కదా?" అని రంగనాథ్ ప్రశ్నించారు. అసలు రియల్ ఎస్టేట్ అంటే చదరపు అడుగుకు రూ.10,000, రూ.15,000 ధరలు పెరగడం కాదని, సామాన్యుడికి, మధ్యతరగతి వారికి సొంతింటి కలను అందుబాటులోకి తీసుకురావడమే నిజమైన అభివృద్ధని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ ఇళ్లు అందుబాటులోకి వచ్చినప్పుడే అది నిజమైన రియల్ ఎస్టేట్ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.గతంలో అమృత-ప్రణయ్ ప్రేమ పెళ్లికి సంబంధించి ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు సమయంలో కూడా సోషల్ మీడియాలో తనపై ఇలాగే ఎన్నో ఆరోపణలు వచ్చాయని, అయినా వృత్తిధర్మాన్ని విడిచిపెట్టలేదని రంగనాథ్ గుర్తుచేశారు. బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గకుండా లక్ష్యంపైనే దృష్టి పెడితే వాస్తవాలు వాటంతట అవే బయటకు వస్తాయని ఆయన అన్నారు.