|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 09:11 PM
రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు భారత ఆర్థిక వ్యవస్థకు ఎప్పటికీ మూలస్తంభం కాబోదని అమెరికా వాణిజ్య ప్రతినిధి, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు జెమీసన్ గ్రీర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ది ఎకనమిక్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, రష్యా-భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ, గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్కో నుంచి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తోందని తెలిపారు.రష్యా రాయితీ ధరకు చమురును విక్రయిస్తుండటంతో గత రెండు, మూడు సంవత్సరాలుగా భారత్ అధికంగా కొనుగోలు చేస్తోందని ఆయన అన్నారు. అయితే, ఢిల్లీ ఈ చమురును కేవలం దేశీయ అవసరాల కోసం మాత్రమే కాకుండా, శుద్ధి చేసి ఇతర దేశాలకు విక్రయిస్తోందని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లు ఒక్కటే భారత్కు బలమైన ఆర్థిక ఆధారమని భావించలేమని, అందుకే ఇతర దేశాల నుంచి కూడా కొనుగోలు చేయాలని సూచిస్తున్నామని తెలిపారు.తమ ఉద్దేశాన్ని భారత్ అర్థం చేసుకోవాలని జెమీసన్ గ్రీర్ అన్నారు. ఈ విషయంలో భారత్ వైవిధ్యభరితమైన చర్యలు ప్రారంభించిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత్ సార్వభౌమ దేశమని, సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉందని ఆయన అన్నారు. ఏ దేశంతో సంబంధాలు కొనసాగించాలి, ఏ దేశంతో తెంచుకోవాలో తాము చెప్పదలుచుకోలేదని, ఈ విషయంలో అమెరికా ఎవరినీ శాసించదని స్పష్టం చేశారు.