|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 07:19 PM
ఓబుళాపురం మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత.. సీబీఐ కోర్టు.. గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్థారించింది. అంతేకాక అతడికి ఏడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని చంచల్గూడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి
ఓబుళాపురం మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో పాటుగా మరో నలుగురు నిందితులకు శిక్ష విధించింది. అయితే తీర్పు ప్రకటించడానికి ముందు న్యాయస్థానం.. గాలి జనార్దన్ రెడ్డి సహా మిగతా దోషులను 'చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా అని ప్రశ్నించింది.
అందుకు జనార్దన్ రెడ్డి స్పందిస్తూ.. తన వయసును, తాను చేసిన సామాజిక సేవలను గుర్తించి, శిక్షను తగ్గించాలని కోరారు. ఆయన విన్నపై జడ్జి స్పందిస్తూ..'ఈ కేసులో పదేళ్ల శిక్ష ఎందుకు వేయకూడదు' అని ప్రశ్నించారు. తాను ఇప్పటికే నాలుగేండ్లకు పైగా సామాజిక సేవ చేస్తున్నానని.. బళ్లారితో పాటు గంగావతిలో కూడా ప్రజలు తనను అఖండ మెజారిటీతో గెలిపించారని ఈ సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. తన సేవలను గుర్తించినందుకే ప్రజలు గెలిపించారని చెప్పారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం.. చివరకు ఆయనకు ఏడేళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో.. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమ తవ్వకాల కేసు సంచలనం సృష్టించింది. ఏపీ అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అక్రమ తవ్వకాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సీబీఐ ఈ కేసును విచారించి.. పలువురిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
విచారనలో భాగంగా గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్ అలీ ఖాన్, ఓఎంసీ కంపెనీని దోషులుగా నిర్ధారించింది. వీరికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. అలానే ఈ కేసుకలో ఆరోపణలు ఎదుర్కొన్న సబితా ఇంద్రారెడ్డి, కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. గతంలో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని హైకోర్టు నిర్దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.