|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 03:52 PM
హైదరాబాద్లోని రామంతాపూర్లో జరిగిన శ్రీకృష్ణాష్టమి ఊరేగింపులో విషాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున జరిగిన విద్యుత్ షాక్ కారణంగా ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. మరణించినవారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. మృతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించింది. గాయపడిన వారికి అయ్యే వైద్య ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.
గోఖులే నగర్లో జరిగిన ఊరేగింపులో రథాన్ని లాగుతుండగా.. అనుకోకుండా విద్యుత్ తీగలు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. తమ కళ్లముందే జరిగిన ఈ విషాదకర సంఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి కుటుంబాలు తీవ్ర శోకంలో మునిగిపోయారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధితుల బంధువులు రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటనపై హైదరాబాద్ కలెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు మంత్రి శ్రీధర్బాబు చెప్పారు.
ఈ ఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. కుటుంబ పెద్దలను కోల్పోయిన ఆ కుటుంబాల రోదనలు అక్కడి వాతావరణాన్ని విషాద భరితం చేశాయి. తమకు న్యాయం జరగాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించిన వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బాధితులకు.. పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. చివరకు పోలీసులు వారిని నచ్చజెప్పి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి నష్టపరిహారం అందేలా చూస్తానని విద్యుత్ శాఖ సీఎండీ వారికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా, వైద్య సహాయం వారికి కొంత ఊరటనిచ్చింది. ఈ ఘటనలో మరణించిన 24 ఏళ్ల కృష్ణయాదవ్ వాళ్ల కుటుంబానికి ఒకే ఒక్క మగపిల్లాడు కావడం.. నూరేళ్లు నిండకుండానే అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అనేది తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటనను వారి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.