|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 05:34 PM
తెలంగాణలో భూమికి సంబంధించిన సేవలను సులభతరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి కావడంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 7,000 మంది సర్వేయర్లకు మొదటి విడత శిక్షణ పూర్తయింది. వీరికి మే 26 నుంచి జూలై 26 వరకు 50 పనిదినాల్లో శిక్షణ ఇచ్చారు.
గత నెల 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 40 రోజుల అప్రెంటిస్ శిక్షణ కూడా ప్రారంభమైంది. రెండో విడత శిక్షణ ఈ నెల 18న రాష్ట్రంలోని 23 జిల్లా కేంద్రాల్లో ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపు సర్వే విభాగం అసిస్టెంట్ డైరెక్టర్కు రిపోర్ట్ చేయాలని మంత్రి సూచించారు. అప్రెంటిస్ శిక్షణ పూర్తయిన వెంటనే అర్హులైన వారికి లైసెన్స్ జారీ చేయనున్నారు. ఈ సర్వేయర్ల సేవలు పారదర్శకంగా ఉండేలా ఒక ప్రత్యేక సర్వే మాన్యువల్ను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన సర్వే విభాగాన్ని బలోపేతం చేయడం ద్వారా మెరుగైన రెవెన్యూ సేవలు అందించవచ్చని ఆయన అన్నారు. రెవెన్యూ, సర్వే విభాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానితమై ఉన్నాయని, సర్వే విభాగం బలోపేతమైతేనే ప్రజలకు సత్వర సేవలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నూతన విధానం భూముల సర్వేలో పారదర్శకతను పెంచడంతో పాటు, ప్రజల సమయాన్ని ఆదా చేస్తుందని ఆశిస్తున్నారు.
తెలంగాణలో భూ లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించిందని.. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో విజయవంతంగా అమలవుతున్న లైసెన్స్డ్ సర్వేయర్ల విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలోనే ప్రకటించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే ఉద్దేశంతో తొలి దశలో 5,000 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించారు.