![]() |
![]() |
by Suryaa Desk | Sun, Jun 08, 2025, 07:16 PM
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ బ్యారేజీ వద్ద శనివారం స్నానానికి వెళ్లి గల్లంతైన ఆరుగురు యువకుల మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. మృతులను మధుసూదన్ (18), పి. శివ మనోజ్ (15), రక్షిత్ (13), కర్నాల సాగర్ (16), రామ్ చరణ్ (18), పి. రాహుల్ (19)గా గుర్తించారు. వీరంతా అంబటిపల్లి, కొర్లకుంట గ్రామాలకు చెందిన ఒకే కుటుంబ బంధువులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎనిమిది మంది బంధువుల వివాహ విందుకు హాజరైన తర్వాత సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్దకు శనివారం స్నానానికి వెళ్లారు. వీరితో పాటు పత్తి వెంకటస్వామి అనే మధ్యవయస్కుడు కూడా ఉన్నారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోతుండగా, వెంకటస్వామి, మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. కాగా, మృతుల్లో మధుసూదన్, మనోజ్.. వెంకటస్వామి కుమారులు కావడం మరింత విషాదకరం. తొలుత ఇద్దరు బాలురు నీటిలో మునిగిపోతుండగా, వారిని కాపాడే ప్రయత్నంలో మిగిలినవారు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిసింది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా మేడిగడ్డ వద్ద గోదావరిలో నీటి ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు.