![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 06:23 PM
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను నియమించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను ముమ్మరం చేసింది. విచారణలో భాగంగా శుక్రవారం బీజేపీ ఎంపీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారిస్తున్నారు.గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన ఈ మూడు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న సమయంలో ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో బ్యారేజీల నిర్మాణానికి నిధుల విడుదల ప్రక్రియ, ఆ సమయంలో మంత్రి మండలి తీసుకున్న తీర్మానాలు, వాటికి సంబంధించిన దస్త్రాలపై కమిషన్ ప్రధానంగా దృష్టి సారించి ఆయన నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు ప్రస్తుత, మాజీ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు (సీఈ), ఐఏఎస్ అధికారులు తమ వాంగ్మూలాలను కమిషన్కు అందించారు.వారు వెల్లడించిన ఆర్థికపరమైన అంశాలు, నిధుల వినియోగం, కేటాయింపుల్లో ఏవైనా లోపాలు జరిగాయా, నిబంధనలను ఉల్లంఘించారా, నాటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలేమిటి అనే కోణంలో ఈటల రాజేందర్ను కమిషన్ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు విచారణలో భాగంగా జూన్ 9వ తేదీన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్రావు, జూన్ 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్లు కూడా కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉంది.