|
|
by Suryaa Desk | Fri, Aug 22, 2025, 07:40 PM
తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు కొత్త బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఈ మార్గంలో నడుస్తున్న ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సుల్లో టికెట్ ధరపై 26 శాతం రాయితీని అందజేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఇప్పటికే అమల్లోకి రావడంతో ప్రయాణికులు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించే అవకాశం లభించింది.
ఈ-గరుడ బస్సుల ప్రత్యేకతలు..
ఈ-గరుడ బస్సులు ఆధునిక సాంకేతికతతో రూపకల్పన చేయబడ్డాయి. ఇవి పూర్తిగా కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో పర్యావరణానికి మేలు చేస్తాయి. సాధారణ డీజిల్ బస్సులతో పోలిస్తే ఈ బస్సుల్లో ప్రయాణం మరింత హాయిగా.. సౌకర్యవంతంగా ఉంటుంది. వీటిలో 100 శాతం సౌకర్యం కలిగిన ఎయిర్ కండీషనింగ్ సదుపాయం ఉంది. విశాలమైన సీటింగ్, ఆధునిక రిక్లైనింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్లు, మొబైల్ హోల్డర్లు, ప్యానోరమిక్ గ్లాస్ విండోస్, ఎర్గోనామిక్ డిజైన్ వంటి సౌకర్యాలు కలవు.
హైదరాబాదు నుంచి విజయవాడ వరకు రోడ్డు దూరం సుమారు 275 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి ఆర్టీసీ ప్రతిరోజూ వందల సంఖ్యలో బస్సులను నడుపుతోంది. సాధారణ పల్లెవెలుగు నుంచి లగ్జరీ వోల్వో, ఈ-గరుడ వరకు అన్ని తరహాల సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఆర్టీసీ.. ఈ రూట్లో ప్రయాణికుల సంఖ్య పెరగడం దృష్ట్యా.. టికెట్ ధరల్లో పలు రకాల రాయితీలను ప్రకటించింది. వాటిలో సూపర్ లగ్జరీ బస్సుల్లో 10 శాతం రాయితీ, ఇంద్ర బస్సుల్లో 15 శాతం రాయితీ, వోల్వో/ఈ-గరుడ బస్సుల్లో 20 శాతం వరకు రాయితీ ఇది వరకే కల్పించగా.. తాజాగా ఈ కొత్త ఆఫర్లలో భాగంగా ఇప్పుడు ప్రత్యేకంగా ఈ-గరుడ బస్సులకు 26 శాతం తగ్గింపు ఇవ్వడం విశేషం.
ప్రస్తుతం హైదరాబాద్–విజయవాడ మార్గంలో 10 ఈ-గరుడ బస్సులు నడుస్తున్నాయి. ట్రాఫిక్ పరిస్థితులను బట్టి ప్రయాణ సమయం 5 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల మధ్య ఉంటుంది. హైదరాబాదులో మియాపూర్, మాహాత్మా గాంధీ బస్ స్టేషన్, ఎల్బీ నగర్ నుంచి బస్సులు బయలుదేరుతుండగా, విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు చేరుకుంటాయి. ఆర్టీసీ భవిష్యత్తులో అన్ని ప్రధాన మార్గాల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకుంది. కాలుష్య రహిత రవాణా ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడమే కాకుండా.. ప్రయాణికులకు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందించడం సంస్థ ప్రధాన ఉద్దేశం. ఈ-గరుడ బస్సులు ఇప్పటి వరకు ప్రజల నుంచి విశేష స్పందన పొందాయి. ఇటీవల టీ24 టికెట్పై ఆర్టీసీ ఆఫర్ ప్రకటించిన సంగతలి తెలిసిందే.