|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 09:12 PM
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో మైనర్ బాలిక హత్య కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. పొట్టకూటి కోసం నగరానికి వచ్చిన బాలిక తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలింది. బాలిక ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో దుండుగులు ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు.. మృతి చెందిన బాలిక నివాసం ఉంటున్న బిల్డింగ్లోనే నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది.
చనిపోయిన మైనర్ బాలిక కుటుంబం నివాసం ఉంటున్న బిల్డింగ్లోనే సంజయ్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అయితే బాలిక హత్య తర్వాత సంజయ్ అక్కడక్కడే అనుమానాస్పందగా తిరుగుతుండటంతో.. అనుమానం వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలానే పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక శరీరంపై సుమారు 20 వరకు కత్తిపోట్లు ఉన్నట్లు నివేదికలో తెలిసింది.
బాలిక శరీరం మీద మొత్తం 20 వరకు కత్తిగాట్లు ఉన్నాయని.. ఒక చిన్న పదునైన ఆయుధం వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలిక మెడ దగ్గర 14 వరకు అలానే పొట్ట దగ్గర 7 కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని తెలిపారు. దుండుగుడు అత్యంత కిరాతకంగా.. చాలా పదునైన ఆయుధంతో బాలికను పొడిచాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 5 టీములు ఈ కేసు కోసం పని చేస్తున్నాయని.. ఇద్దరిని అనుమానితులుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. హత్య జరిగిన ఇంటికి సంబంధించిన సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బాలిక తల్లిదండ్రులైన వెంకటేష్, రేణుక దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం హైదరాబాద్కు వలస వచ్చారు. వారు కూకట్పల్లిలో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ బైక్ మెకానిక్ కాగా.. అతడి భార్య రేణుక ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ సోమవారం ఉదయం వారి పనులకు వెళ్లడంతో.. వారి 12 ఏళ్ల కూతురు సహస్ర ఇంటి వద్ద ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో వెంకటేష్ ఇంటికి వచ్చి చూసే సరికి అతడి కుమార్తె రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్కు గురయ్యాడు.
అయితే ఈ ఘటనలో బాలికను హత్య చేయడానికి ముందు బాధితురాలిపై దుండుగుడు లైంగిక దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అయితే బాలిక ఎదురు తిరగడంతో.. నిందితుడు.. బాలికను కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. బాలిక నివాసం దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో యువకుడు బాధితురాలి ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు ప్రత్యక్షం అయ్యాయి. అతడు ఆ కుటుంబానికి దగ్గరి బంధువుగా పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే అసలు నేరస్తుడిని పట్టుకుంటామని పోలీసులు అంటున్నారు.