|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 10:41 PM
హైదరాబాద్ నగరంలో పెరిగిన ఇంధన ధరలు, అధిక ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కంటే బస్సు ఛార్జీలు పెరగడంతో సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికుల కష్టాలను అర్థం చేసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, వివిధ రూట్లలో టికెట్ ధరలను తగ్గించారు. తాజాగా.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'ట్రావెల్ యాజ్ యూ లైక్' టికెట్ ధరను తగ్గించడం ప్రయాణికులకు ఒక శుభవార్త. ఈ ఆఫర్ వల్ల పురుష ప్రయాణికులకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించింది.
ఆగస్టు 15 నుంచి 31 వరకు అందుబాటులో ఉండే ఈ తగ్గింపులో భాగంగా, మెట్రో డీలక్స్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించడానికి ఉపయోగపడే TAYL టికెట్ ధరలను సవరించారు. గతంలో రూ.150 ఉన్న పెద్దల టికెట్ ధర ఇప్పుడు రూ.130కి తగ్గింది. అలాగే, మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.120 నుండి రూ.110కి, పిల్లలకు రూ.100 నుండి రూ.90కి టికెట్ ధరను తగ్గించారు. ఈ టికెట్తో 24 గంటల పాటు నగరంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.
సజ్జనార్ విప్లవాత్మక నిర్ణయాలు..
ఎండీ సజ్జనార్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. ఇటీవల విజయవాడ-హైదరాబాద్ రూట్లో కూడా టికెట్ ధరలను తగ్గించడం ప్రయాణికులకు ఎంతో మేలు చేసింది. ఇది ఆర్టీసీకి కూడా ప్రయాణికుల సంఖ్య పెరగడానికి దోహదపడింది. ఈ టికెట్ ధర తగ్గింపు కూడా అదే కోవలోకి వస్తుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఆర్టీసీ కొత్త టెక్నాలజీలను కూడా ప్రవేశపెట్టనుంది.
భవిష్యత్తులో వాట్సాప్ టికెటింగ్ సేవలను ప్రారంభించనున్నారు. దీని ద్వారా ప్రయాణికులు వాట్సాప్ ద్వారా ప్రయాణ వివరాలను నమోదు చేసుకుని, వెంటనే ఇ-టికెట్ పొందవచ్చు. అలాగే.. డిజిటల్ బస్ పాస్లను కూడా ప్రవేశపెట్టనున్నారు. ఇవన్నీ ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని, వేగాన్ని అందిస్తాయి. సజ్జనార్ తీసుకుంటున్న ఈ చర్యలు ప్రయాణికులు ఇబ్బందులను తగ్గించి, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి దోహదపడుతున్నాయి.