![]() |
![]() |
by Suryaa Desk | Sat, Jul 12, 2025, 03:50 PM
నిజామాబాద్ జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. విశ్రాంతి కోసం జాతీయ రహదారి పక్కన ఆపిన లారీలో నుంచి సెల్ ఫోన్ డబ్బాలను దొంగలు ఎత్తుకెళ్లారు. లారీ డ్రైవర్ ఫిర్యాదుతో నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెల్ ఫోన్ల లోడ్ తో హైదరాబాద్ కు బయలుదేరిన లారీ డ్రైవర్ తెల్లవారుజామున హైవే పక్కన విశ్రాంతి కోసం లారీని ఆపాడు. కాసేపు నిద్రించాక తిరిగి ప్రయాణం ప్రారంభించే ముందు లారీలోని సరుకును పరిశీలించగా.. సెల్ ఫోన్లతో నిండిన డబ్బాలు అన్నీ కనిపించలేదు. దీంతో బాధితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చోరీకి గురైన సెల్ ఫోన్ల విలువ మార్కెట్లో సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటుందని డ్రైవర్ పోలీసులకు తెలియజేశాడు.