![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 08:16 PM
అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. చదువుకుంటూనే ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా జీతం (స్టైపెండ్) పొందేందుకు వీలు కల్పించే ఒక వినూత్న కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా.. ఆచరణాత్మక నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవచ్చు.
హైదరాబాద్లోని విశ్వవిద్యాలయ క్యాంపస్లో సోమవారం రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్వీకే రెడ్డి, రాసి ఎగ్జిక్యూటివ్ హెడ్ జేమ్స్ రాఫెల్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. రాసితో ఎంఓయూ కుదుర్చుకున్న మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం తమదేనని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులలో నైపుణ్యం పెంపొందించడానికి ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో దోహదపడుతుందని ఆయన వివరించారు.
స్టైపెండ్ ఆధారిత అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రొఫెసర్ చక్రపాణి కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం, ఉత్సాహవంతులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రోగ్రాంలో చేరడం ద్వారా విద్యార్థులు నెలకు కనీసంగా రూ. 7,000 నుండి గరిష్ఠంగా రూ. 24,000లకు మించి సంపాదించుకునే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు సైతం అర్హులేనని, అలాగే ఈ ప్రోగ్రాంలో చేరేందుకు 18 నుండి 28 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని తెలిపారు. త్వరలో విశ్వవిద్యాలయ వెబ్పోర్టల్లో పూర్తి వివరాలు తెలియజేస్తామని, రాసితో కలిసి ఉమ్మడి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
జేమ్స్ రాఫెల్ మాట్లాడుతూ.. ఉద్యోగానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి, వారు చదువుతున్నప్పుడే ఆర్థికంగా సాయపడేలా స్టైపెండ్ అందిస్తామని తెలిపారు. ఈ వినూత్న పథకం విద్యార్థులకు విద్యను కొనసాగించడంలో ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, వాస్తవ ప్రపంచంలో పని అనుభవాన్ని, అవసరమైన నైపుణ్యాలను పొందడానికి సహాయపడుతుంది. ఇది వారి భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది. తెలంగాణలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ కార్యక్రమం ఇతర విశ్వవిద్యాలయాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.