|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 05:37 PM
దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఉబర్, ఓలా వంటి సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. రద్దీ సమయాల్లో వసూలు చేసే సర్జ్ ప్రైసింగ్ పరిమితిని గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ‘మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్’ను సవరిస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.తాజా నిబంధనల ప్రకారం.. రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీపై గరిష్టంగా 200 శాతం వరకు సర్జ్ ఛార్జీని వసూలు చేసుకునేందుకు క్యాబ్ అగ్రిగేటర్లకు అనుమతి లభించింది. గతంలో ఈ పరిమితి 150 శాతంగా ఉండేది. సాధారణ రద్దీ సమయాల్లో బేస్ ఛార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.అయితే, ప్రయాణికులకు కొంత ఊరటనిచ్చేలా కేంద్రం ఒక షరతు విధించింది. మూడు కిలోమీటర్లలోపు చేసే ప్రయాణాలపై ఎలాంటి అదనపు సర్జ్ ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు క్యాబ్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చనుండగా, రద్దీ వేళల్లో ప్రయాణించే వారిపై ఛార్జీల భారం పెరిగే అవకాశం ఉంది.