![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jun 05, 2025, 05:41 PM
సికింద్రాబాద్లోని అల్వాల్ పరిధిలో గల చినరాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి, చెరువు భూమిలో అక్రమంగా చేపట్టిన మూడు భవన నిర్మాణాలను కూల్చివేశారు. నిర్మాణదారులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.చినరాయుని చెరువుకు చెందిన ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు వ్యక్తులు అక్రమంగా భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని స్థానికులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అక్రమ నిర్మాణాలను గుర్తించారు.ఈ క్రమంలో, గురువారం ఉదయం హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు నడుమ చినరాయుని చెరువు వద్దకు చేరుకుని, అక్రమంగా నిర్మిస్తున్న మూడు నిర్మాణాలను యంత్రాల సహాయంతో నేలమట్టం చేశారు. ఈ చర్యను నిర్మాణదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ అధికారులు నిర్మాణాలను కూల్చివేశారు.