|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 07:52 PM
బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దసరా కానుకగా చీరలు పంపిణీ చేయనుంది. అయితే ఈసారి రేషన్ కార్డు ఉన్న మహిళలకు పంపిణీ చేయకుండా.. కేవలం మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సభ్యురాలికి రెండేసి చీరలు ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించబడింది. ఒక్కో చీర రూ.800 ఉండగా.. రెండేసి చీరలు కావునా రూ.1600 వరకు మహిళలకు కానుకగా ఇవ్వనుంది ప్రభుత్వం. గత ఏడాది రేషన్ కార్డు ఉన్న మహిళలు కూడా ఈ కానుక పొందగా.. ఈసారి మాత్రం వారిని పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా పల్లెటూర్లలో, పట్టణాల వార్డులలో అనేక మహిళలు రేషన్ కార్డు ఆధారంగా గతంలో చీరలు పొందారు. ఆ చీరలు నాసిరకంగా ఉన్నప్పటికీ.. చాలా మంది తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం తమను పక్కనపెట్టడం అన్యాయమని మహిళలు ఆరోపిస్తున్నారు. మహిళా సంఘాల జాబితాలో లేని గృహిణులు, పేద కుటుంబాల వారు ప్రభుత్వాన్ని తమకూ చీరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. “మేము కూడా పేదవారమే, రేషన్ కార్డు ఆధారంగా ఎన్నో సౌకర్యాలు ఇస్తున్నారు. అయితే బతుకమ్మ చీరల్లో మాకు తేడా ఎందుకు?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మాత్రం ‘ఇందిరా మహిళా శక్తి’ పేరుతో మహిళా సంఘాలకే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. సిరిసిల్లలో తయారయిన చీరలు ఇప్పటికే జిల్లాలకు చేరుకున్నాయి. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో పంపిణీ కూడా స్టార్ట్ అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వస్తే.. యాదాద్రి, సూర్యాపేట వంటి జిల్లాల్లోని గోదాముల్లో నిల్వ ఉంచి.. అక్కడి నుంచి మున్సిపాలిటీలు, మండలాల వారీగా పంపిణీ చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. కామారెడ్డి పట్టణంలో ప్రత్యేక దృశ్యం కనిపించింది. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని ట్రాన్స్ జెండర్ సమాజానికి కానుకలు అందించారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి. తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 20 మంది ట్రాన్స్ జెండర్లకు చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పండుగలో అందరినీ సమానంగా గుర్తించడం, వారికి గౌరవం ఇవ్వడం మన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ వేడుక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. పండగ సంబరాల్లో భాగమయ్యే అవకాశం ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేసిన ట్రాన్స్ జెండర్లు, ఈ సహకారం తమకు నమ్మకం, ఆత్మవిశ్వాసం కలిగించిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పంపరిలతా శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, తాటి లావణ్య ప్రసాద్, మామిడ్ల రమేష్, రంగా రమేష్ గౌడ్, బల్ల శ్రీనివాస్, కిరణ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.