|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 07:48 PM
సమాజంలో పేద, బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకోవడం కోసం.. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సాహించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, స్కాలర్షిప్ ప్రోగ్రాములను తీసుకు వస్తుంటాయి. అయితే వీటి గురించి సరైన ప్రచారం లేక.. చాలా మందికి ఈ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియడం లేదు. అలాంటి ఓ స్కాలర్షిప్ ప్రోగ్రాం గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. దీని ద్వారా ఒకటో తరగతి నుంచి ఉన్నత విద్య వరకు అన్ని క్లాసుల వారికి స్కాలర్షిప్ ఇస్తారు. మరి దీనికి ఎవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలి.. చివరి తేదీ ఎప్పుడు వంటి వివరాలు..
బీడీ కార్మికుల కుటుంబాల విద్యార్థులకు ఇది నిజంగా శుభవార్తే. వారికి కేంద్ర ఉపాధి, మంత్రిత్వ శాఖ ఉపకార వేతనాలు అందజేస్తోంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు అంటే ప్రీమెట్రిక్.. అలానే ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు చదివేవారు అనగా పోస్ట్ మెట్రిక్ వారికి స్కాలర్షిప్ అందివ్వనున్నారు. మరి దీనికి ఎవరు అర్హులు అంటే.. ప్రభుత్వ అనుమతి ఉన్న స్కూళ్లు, కాలేజీల్లో చదివే వారంతా ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్కి అర్హులు. ప్రీమెట్రిక్ వారికి అనగా 1-10వ తరగతి విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందాలంటే.. సెప్టెంబర్ 30వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
అలానే పోస్ట్ మెట్రిక్ అంటే ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వచ్చే నెల అనగా అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంది. వీరు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 7.2 లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే.. వీరి కుటుంబాల్లో మొత్తం 8.5 లక్షల మంది పిల్లలు స్కూల్, కాలేజీల్లో చదువుకుంటున్నారు. వీరంతా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అయితే అప్లై చేసే సమయంలో ఏవైనా సమస్యలున్నా, ఇతర వివరాలు తెలియాలన్నా.. జిల్లా కేంద్రాల్లో ఉన్న బీడీ కార్మిక సంక్షేమ ఆసుపత్రుల వద్దకు వెళ్లి ఆరా తీస్తే వారు మరిన్ని వివరాలు వెల్లడిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు.. ఈ లింక్ ద్వారా https://scholarships.gov.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అయితే ఇంటర్, డిగ్రీ ఫస్టియర్ విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందాలంటే.. వారు పదో తరగతి, ఇంటర్లో పాస్ అయి ఉండాలి. సప్లిమెంటరీలో పాస్ అయిన వారికి, డిస్టెన్స్లో చదువుకునే వారికి ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకునేందుకు అవకాశం లేదు.
ఈ స్కాలర్షిప్ పథకంలో భాగంగా 1 నుంచి 4వ తరగతి వరకు చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ. 1000, అలానే 5-8వ తరగతి చదివే వారికి రూ.1500, 9-10వ తరగతి చదివే వారికి సంవత్సరానికి రూ. 2 వేలు, ఇంటర్ వారికి ఏడాదికి రూ.3 వేలు స్కాలర్షిప్ ఇస్తారు. అలానే డిగ్రీ, ఐటీఐ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదివే వారికి సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తారు. అలానే బీటెక్, బీఏఎంఎస్, ఇతర కోర్సులు చదివే వారికి సంవత్సరానికి రూ.25 వేలు స్కాలర్షిప్ అందిస్తారు. కనుక ఆసక్తి ఉన్న వారు త్వరగా అప్లై చేసుకోండి.