|
|
by Suryaa Desk | Fri, Sep 19, 2025, 04:42 PM
తెలంగాణలో పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడం సిగ్గుచేటని ఆయన అన్నారు.పండుగలు వస్తే ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రత్యేక సర్వీసుల పేరుతో పల్లె వెలుగుతో సహా అన్ని బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయడం ప్రయాణికులపై పెనుభారం మోపడమేనని ఆయన అన్నారు. ఈ చర్యతో ప్రజల పండుగ సంతోషాన్ని ప్రభుత్వం దూరం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రజాపీడనే అని పేర్కొన్నారు.