|
|
by Suryaa Desk | Thu, Sep 18, 2025, 03:26 PM
భాగ్యనగరాన్ని బుధవారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. అకస్మాత్తుగా కురిసిన కుండపోత వానతో నగరం అస్తవ్యస్తంగా మారింది. పలు ప్రధాన రహదారులు చెరువులను తలపించడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. గంటల తరబడి వాహనాలు ముందుకు కదలకపోవడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కొండాపూర్ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాలతో పాటు సరూర్ నగర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, సైదాబాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అనేక చోట్ల వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.వాతావరణ శాఖ లెక్కల ప్రకారం, నగరంలో అత్యధికంగా మియాపూర్లో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత లింగంపల్లిలో 8.2 సెం.మీ., హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో 8.1 సెం.మీ., గచ్చిబౌలిలో 6.6 సెం.మీ., చందానగర్లో 6.4 సెం.మీ. వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.