|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 09:41 PM
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు ఉన్నాయి. వీటి దరఖాస్తులను ప్రజాపాలనలో భాగంగా తీసుకున్నారు. ఆ తర్వాత రేవంత్ సర్కార్ ప్రజలకు సంక్షేమాన్ని అందించే దిశగా అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. అందులో రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వాటితో పాటు ఇందిరమ్మ ఇళ్లు పథకం కూడా పెద్ద ఎత్తున అమలవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చే ఉద్దేశంతో ఈ పథకం ముందుకు సాగుతోంది.
సిద్దంగా గృహ ప్రవేశాలు..
గృహనిర్మాణ సంస్థ ఎండీ వీపీ గౌతం ఇచ్చిన వివరాల ప్రకార.. ఇప్పటి వరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మొత్తం 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమవగా, 1.29 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిలో 20 వేల ఇళ్లు గోడల వరకు, 8,633 ఇళ్లు పైకప్పు వరకు పూర్తయ్యాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో నిర్మాణం ముగిసిన ఇళ్లకు గృహప్రవేశాలు జరుగుతున్నాయి.
13,841 మందికి రూ.146.30 కోట్లు..
లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను నేరుగా జమ చేసే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. ప్రతి సోమవారం ఆధార్ నెంబర్ ఆధారంగా డబ్బులు జమ అవుతున్నాయి. ఇటీవల 13,841 మందికి రూ.146.30 కోట్లు విడుదల చేశారు. ఈ పథకం మొత్తంగా నాలుగు విడతలుగా నిధుల బదిలీపై ఆధారపడి సాగుతోంది. ఇప్పటికే చాలా మందికి మూడో, నాలుగో విడతల బిల్లులు వచ్చి చేరాయని లబ్ధిదారులు చెబుతున్నారు. మీరు కూడా ఒక్కసారి అకౌంట్ చెక్ చేసుకోండి.. ప్రతీ సోమవారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబ్బులను ప్రభుత్వం జమ చేస్తోంది.
ప్రజలు గృహనిర్మాణం పూర్తి చేసి సొంత గృహంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుండటం ఆనందకరమైన విషయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తుండటంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఉపశమనం లభిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద కుటుంబాలు స్థిరత్వాన్ని పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.