|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 05:55 PM
రాష్ట్రంలోని గృహ నిర్మాణశాఖ ఆదాయాన్ని పెంచుకునే దిశగా మరో ముందడుగు వేసింది. ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్లను రెండో విడతలో వేలం వేయడానికి సిద్ధమైంది. ఈ వేలం ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా రాజీవ్ స్వగృహ , హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ద్వారా రూ.3,500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి తోడు, మొదటి విడతలో జరిగిన వేలం ద్వారా రూ.1,200 కోట్లకు పైగా ఆదాయం సమకూరడం ప్రభుత్వ లక్ష్యాలకు మరింత బలాన్నిచ్చింది. తొలి విడత సక్సెస్ కావటంతో మిగిలిన ఆస్తులను వేలం వేయడానికి గృహ నిర్మాణ శాఖకు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. దీంతో తాజాగా రెండో విడత వేలానికి నోటిఫికేషన్ ఇచ్చింది.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఈ విడతలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పోచారం, గాజులరామారం ప్రాంతాల్లోని టవర్లలో ఉన్న ఫ్లాట్లను వేలం వేయనున్నారు. వీటి ద్వారా రూ.100 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో మంత్రిమండలి ఉపసంఘం ఆమోదించిన మహబూబ్నగర్ జిల్లాలోని పోతులమడుగు, అమిస్తాపూర్లలోని ఖాళీ స్థలాలతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన తొర్రూర్, కుర్మల్గూడ, బహదూర్పల్లి, జవహర్నగర్లోని ఖాళీ ప్లాట్లను కూడా వేలం వేయడానికి సిద్ధమవుతున్నారు. హౌసింగ్ బోర్డు పరిధిలో గ్రేటర్ హైదరాబాద్లోని చింతల్ హౌసింగ్ బోర్డు కాలనీ, ఐడీపీఎల్ కూడలి, నిజాంపేట ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, ఫ్లాట్ల ద్వారా మరో రూ.100 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది.
గృహ నిర్మాణ శాఖకు ఈ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద, మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణ పథకాలకే ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రజల గృహ స్వప్నాన్ని సాకారం చేయడంతో పాటు ప్రభుత్వానికి నిధులు సమకూర్చుకోవడం ఈ వేలం ప్రక్రియ ప్రధాన లక్ష్యం. త్వరలోనే ఈ వేలం ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఈ వేలం ద్వారా సామాన్య ప్రజలు కూడా అనువైన ప్రదేశాల్లో తక్కువ ధరకే ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.