|
|
by Suryaa Desk | Wed, Sep 17, 2025, 03:51 PM
తెలంగాణ రాజకీయాల్లోకి మరో పార్టీ పుట్టుకొచ్చింది. బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం కోసం కొత్త పార్టీని స్థాపిస్తానని ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. బుధవారం (2025, సెప్టెంబర్ 17) హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో పార్టీని ప్రకటించారు. పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) గా ప్రకటించిన మల్లన్న.. పార్టీ విధివిధానాలు, లక్ష్యాలు ప్రకటించారు. పార్టీ జెండాను ఎరుపు, ఆకుపచ్చ రంగులో తీసుకొచ్చారు. జెండా మధ్యలో పడికిలి బిగించిన చేయితో పాటు.. కార్మిక చక్రం, వరి కంకులతో జెండా రూపొందించారు. జెండా పై భాగంలో ఆత్మ గౌరవం, అధికారం, వాటా నినాదాలను పేర్కొన్నారు. అదే విధంగా పిడికిలి కింది భాగంలో పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీగా పేర్కొన్నారు. బీసీ మేధావి నారా గోని చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆకుపచ్చ రంగు అంటే రైతులు.. ఎర్ర రంగు అంటే పోరాటం అని ఈ సందర్భంగా ప్రకటించారు మల్లన్న. డిజైనర్ రాజేశం పార్టీ జెండాను రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఫాం లు అడుక్కునే పరిస్థితి ఈ రోజు నుంచి ముగిసిందని పార్టీ ఆవిష్కరణ సందర్భంగా మల్లన్న అన్నారు. సెప్టెంబర్ 17 కు ఎంతో గొప్ప చరిత్ర ఉందని.. పెరియార్ జయంతి, విశ్వ కర్మ జయంతి అయిన రోజున బీసీల తలరాత మరే రోజుగా పార్టీ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ప్రకటన అంటే బీసీ మేధావులని పిలిచి ప్రోగ్రాం నడపాలని కోరినట్లు తెలిపారు. బీసీలకు రాజకీయ పార్టీ అవసరం అని మేధావులు, బీసీల డిమాండ్ ఎప్పట్నుంచో ఉందని అన్నారు.