|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 08:22 PM
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. సామాన్యులకు కూడా విమానయానాన్ని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో "గ్రాండ్ రన్అవే ఫెస్ట్" పేరుతో ప్రత్యేక సేల్ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద దేశీయ మార్గాల్లో వన్-వే ప్రయాణానికి టికెట్ ధరలను కేవలం రూ. 1,299 నుంచే అందిస్తున్నట్టు ప్రకటించింది.ఈ ప్రత్యేక సేల్లో భాగంగా, అంతర్జాతీయ రూట్లలో ప్రయాణానికి టికెట్ ధరలు రూ. 4,599 నుంచి ప్రారంభమవుతాయని ఇండిగో సంస్థ తెలిపింది. ఇవి ఎకానమీ క్లాస్ ధరలు కాగా, బిజినెస్ క్లాస్లో ప్రయాణించాలనుకునే వారు సుమారు రూ. 9,999 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ ఈ నెల 15న ప్రారంభమైంది. ప్రయాణికులు ఈ నెల 21లోపు టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకున్న వారు వచ్చే ఏడాది జనవరి 7 నుంచి మార్చి 31 మధ్య కాలంలో ప్రయాణించేందుకు వీలు కల్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అనుకూలంగా కడప-హైదరాబాద్, కడప-విజయవాడ, హైదరాబాద్-సేలం, జగదల్పూర్-హైదరాబాద్ వంటి పలు కీలక రూట్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉందని సంస్థ పేర్కొంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా అనేక ఇతర మార్గాల్లో కూడా ఈ రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపింది.