|
|
by Suryaa Desk | Wed, Sep 10, 2025, 06:17 PM
టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు శర్వానంద్ ఇప్పుడు నిర్మాతగా సరికొత్త ప్రయాణాన్ని ఆరంభించారు. ఆయన 'ఓమీ' పేరుతో ఒక నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ సంస్థను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శర్వానంద్ తన భవిష్యత్ ప్రణాళికలను మీడియాకు వివరించారు. 'ఓమీ' అనేది కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాదని, భవిష్యత్ తరాల కోసం ఒక దార్శనికతతో దీనిని ప్రారంభిస్తున్నట్లు శర్వానంద్ తెలిపారు. నిబద్ధత, మంచి సంకల్పం, బాధ్యతలతో కూడిన ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా సృజనాత్మకత, ఐక్యత, సుస్థిరత వంటి విలువలకు ప్రాధాన్యతనిస్తూ 100 శాతం సహజమైన కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.ఇప్పటివరకు వెండితెరపై చెప్పని కథలను తన నిర్మాణ సంస్థ ద్వారా చెప్పేందుకు ప్రయత్నిస్తానని శర్వానంద్ పేర్కొన్నారు. నటీనటులు, సృజనాత్మక నిపుణులను ఏకతాటిపైకి తీసుకొచ్చే వేదికగా 'ఓమీ' నిలుస్తుందని ఆయన అభివర్ణించారు. కేవలం సినిమాలు నిర్మించడమే కాకుండా, ఆరోగ్యం, ప్రకృతితో మమేకమయ్యే జీవనశైలిని ప్రోత్సహించడం కూడా తమ సంస్థ ఉద్దేశమని ఆయన వెల్లడించారు. ఈ కొత్త పయనంతో చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసేందుకు శర్వానంద్ సిద్ధమయ్యారు.
Latest News