![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 05:54 PM
జూన్ ఒకటో తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూతపడతాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో చర్చలు విఫలమైతే బంద్కు వెళ్లే ఆలోచన ఉందన్న మాట వాస్తవమే అయినా, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని తేల్చిచెప్పింది. శనివారం ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో జరిగిన సమావేశం అనంతరం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు.దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, "థియేటర్ల బంద్ ఉంటుందని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. చర్చలు సఫలం కాకపోతే జూన్ 1 నుంచి అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందేమోనని మాత్రమే అంతర్గతంగా అనుకున్నాం. కానీ, అందరూ థియేటర్లు మూసేస్తున్నారనే ప్రచారం చేశారు. ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. దయచేసి ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దు" అని విజ్ఞప్తి చేశారు. కేవలం ఒక సినిమాను దృష్టిలో పెట్టుకుని థియేటర్లను బంద్ చేస్తున్నామనడం సరికాదని, కొన్ని వార్తలు పరిశ్రమ వ్యాపారాన్ని దెబ్బతీస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News