|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 04:49 PM
హెచ్-1బీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నిర్ణయం తెలుగు టెకీలపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులు దిగ్భ్రాంతికి గురిచేశాయని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ నిర్ణయంతో తెలుగు టెకీల ఆవేదన వర్ణనాతీతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాకు సేవలు అందిస్తున్న నిపుణుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ యుద్ధ ప్రాతిపదికన ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.