|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 08:06 PM
హైదరాబాద్ నగరవాసులకు పాస్పోర్ట్ సేవలను మరింత సులభతరం చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) మెట్రో స్టేషన్లో కొత్తగా పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని (పీఎస్కే) ఏర్పాటు చేశారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ మార్పుతో నగరంలోని రెండు ప్రధాన పాస్పోర్ట్ సేవా కేంద్రాల చిరునామాలు మారాయి. వివరాల్లోకి వెళ్తే, ఇన్ని రోజులు అమీర్పేటలోని ఆదిత్య ట్రేడ్ సెంటర్లో కొనసాగిన పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఇప్పుడు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్కు పూర్తిగా తరలించారు. అదేవిధంగా, టోలీచౌకీ షేక్పేట్లోని ఆనంద్ సిలికాన్ చిప్ భవనంలో పనిచేస్తున్న మరో కేంద్రాన్ని రాయదుర్గం పాత ముంబయి రోడ్డులోని సిరి బిల్డింగ్లోకి మార్చారు. మంగళవారం నుంచి ఈ రెండు కేంద్రాలు తమ కొత్త ప్రదేశాల నుంచి పూర్తిస్థాయిలో సేవలను అందిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.