|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 07:45 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ. 1,435 కోట్లను విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ వెల్లడించారు. ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులను పారదర్శకంగా చేపడుతున్నామని ఆయన తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కింద మొత్తం 2.15 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా, వాటిలో 1.29 లక్షల ఇళ్లు ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని ఆయన తెలిపారు. వీటిలో సుమారు 20 వేల ఇళ్లు గోడల స్థాయికి చేరుకోగా, మరో 8,633 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.