|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 09:45 PM
డిసెంబర్ 16, 2012లో ఢిల్లీలో చోటు చోటు చేసుకున్న నిర్భయ సామూహిక అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. మహిళల భద్రత, చట్టాల గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. 23 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థిని ఆరుగురు వ్యక్తులు బస్సులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడిపై దాడి చేసి ఆ దారుణానికి ఒడిగట్టారు. 13 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె.. ఆ తర్వాత ప్రాణాలు విడిచింది. కేసు ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను ఆగ్రహానికి గురి చేసింది.
ఈ ఘటన జరిగిన రెండ్రోజులకు అంటే డిసెంబర్ 18న అచ్చం అటువంటి ఘటనే అప్పటి ఉమ్మడి ఏపీ సిద్ధిపేటలో చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి దారుణంగా హతమార్చారు. కరీంనగర్ ప్రాంతానికి చెందిన అఫ్సర్, నరేందర్, శ్రీనివాస్ అనే ముగ్గురు వ్యక్తులు ఈ ఘోరానికి పాల్పడ్డారు. అనంతరం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోగా.. ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం ఈ ఘోరానికి పాల్పడిన కరీంనగర్కు చెందిన ముగ్గురు నిందితులలో ఒకడైన నరేందర్కు జీవిత ఖైదు పడింది. దాదాపు పన్నెండేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత సెప్టెంబర్ 10, 2025న కోర్టు నరేందర్కు జీవిత ఖైదు విధించింది.
అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును అణచివేయడానికి ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. అప్పటి బీజేపీ కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడు, కార్పొరేటర్, ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఈ కేసును ప్రభుత్వం అణచివేస్తుందని తీవ్రంగా ఆరోపించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ పలు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్భయ తరహా ఘటన జరిగితే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. బాధితుల పక్షాల పోరాటం చేశారు. తాజాగా.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నరేందర్కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ..బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. ఇది న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఈ తీర్పు ఇతర నేరస్తులకు ఒక హెచ్చరికగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కేసులో మిగిలిన నిందితులపై విచారణ కొనసాగుతుంది.