|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 02:49 PM
భారత్ - యూఏఈ మధ్య ప్రయాణాన్ని సమూలంగా మార్చేసే ఒక భారీ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ముంబై నుంచి దుబాయ్కి అరేబియా మహా సముద్రం అడుగున హైస్పీడ్ రైలును నడపాలనే ప్రతిపాదన ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ కల గనుక నిజమైతే గంటకు 600 నుంచి 1,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 'డీప్ బ్లూ ఎక్స్ప్రెస్' విమానం కంటే వేగంగా గమ్యస్థానానికి చేరుస్తుంది.ఈ ప్రాజెక్టులో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే.. సముద్ర మట్టానికి 200 మీటర్ల లోతులో ఉండే ఈ టన్నెల్కు పనోరమిక్ కిటికీలను ఏర్పాటు చేయనున్నారు. అంటే, మీరు రైల్లో కూర్చుని వెళ్తుంటే.. కిటికీ బయట తిమింగలాలు, షార్కులు, రకరకాల సముద్ర జీవులు మీ పక్కనే ఈదుతున్నట్లు కనిపిస్తాయి. సూపర్ సోనిక్ వేగంతో వెళ్తున్నప్పటికీ, ప్రపంచంలోనే అతిపెద్ద అక్వేరియంలో ప్రయాణిస్తున్న అద్భుత అనుభూతిని ఇది అందిస్తుంది.సుమారు 50 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్తో తలపెట్టిన ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణికుల కోసమే కాదు, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను కూడా బలోపేతం చేయనుంది. దుబాయ్ నుంచి భారత్కు ముడి చమురును ఈ పైపులైన్ ద్వారా రవాణా చేయవచ్చు. భారత్ నుంచి స్వచ్ఛమైన నీటిని యూఏఈకి తరలించే అవకాశం ఉంటుంది. ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణ ఖర్చులు దాదాపు 60 శాతం వరకు తగ్గుతాయని అంచనా.