|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 02:00 PM
ఇతర మతాలను ఎవరైనా కించపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో హేట్ రేట్ చట్టం ప్రవేశపెడతామని వెల్లడించారు. ఎవరి మతాన్ని వారు ఆచరించే స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం ఇతర మతాలను కించపరచకుండా చట్టాన్ని సవరించిందని గుర్తు చేశారు. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నామంటే సోనియా గాంధీ పాత్ర, త్యాగం ఉందని అన్నారు. డిసెంబర్ నెల కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైనదని ఆయన అన్నారు. డిసెంబరు నెలలో ప్రజాప్రభుత్వం ఏర్పడిందని, సోనియా గాంధీ ఇదే నెలలో జన్మించారని ఆయన వెల్లడించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఏసు ప్రభువు బోధనల స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. శాంతిని కాపాడుతూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ప్రతి పేదవాడికి నెలకు 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.