|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 07:18 PM
మనుషుల జీవితాల్లో అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. కొందరికి ఎంతో శ్రమ తర్వాత విజయం లభిస్తే.. మరికొందరిని విధి ఒక్క రాత్రిలోనే శిఖరాగ్రాన కూర్చోబెడుతుంది. సరిగ్గా ఇలాంటి అద్భుతమే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మోనాలిసా భోంస్లే జీవితంలో జరిగింది. కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటూ జీవనం సాగించిన ఒక సామాన్య బాలిక.. నేడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక వెలుగుతున్న తారగా మారింది.
ఒకప్పుడు ప్రతిభ వెలుగులోకి రావాలంటే ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ నేడు ఒక చిన్న వీడియో లేదా ఒక ఫొటో మనిషి తలరాతను మార్చేస్తోంది. కుంభమేళాకు వచ్చిన వేలాది మందిలో మోనాలిసా ప్రత్యేకంగా కనిపించడానికి కారణం ఆమె ముఖంలోని ఆ అమాయకత్వం చూసిన నెటిజన్లు ఆమెను ఆదరించడం, అది కాస్త చలనచిత్ర పరిశ్రమ దృష్టికి వెళ్లడం ఒక అద్భుత మలుపు.
వందల రూపాయల కోసం ఆరాటపడిన మోనాలిసా.. ఇప్పుడు ఖరీదైన వాహనాల్లో ప్రయాణిస్తూ పలు ప్రమోషన్లకు హాజరవుతోంది. అంతే కాకుండా... బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా రూపొందిస్తున్న ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికవ్వడం ఆమె కెరీర్లో ఒక మైలురాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా ఆమె అడుగుపెడుతోంది. తాజాగా 'బేల్ ట్రీ హోటల్' తన సంస్థ విస్తరణలో భాగంగా.. హైదరాబాద్లో కిచెన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీని ప్రారంభోత్సవానికి అతిథిగా మోనాలిసా వచ్చారు. దీంతో ఆమెను చూసేందుకు చాలా మంది ఎగబడ్డారు. స్థానిక నటుల కంటే మోనాలిసాకు ఉన్న క్రేజ్ను చూసి భాగ్యనగర వాసులు ఆశ్చర్యపోయారు.
మోనాలిసా అనే పేరు వినగానే మనకు మొదటగా గుర్తొచ్చేది ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ గీసిన అద్భుత కళాఖండం. 16వ శతాబ్దంలో గీసిన ఆ చిత్రంలోని మహిళ చిరునవ్వు ప్రపంచంలోనే ఒక రహస్యం. ఆ చిత్రంలోని మోనాలిసా కళ్లలో కనిపించే గాంభీర్యం, ముఖంలోని ప్రశాంతత ఈ అమ్మాయిలో కూడా ఉన్నాయని నెటిజన్లు భావించబట్టే ఆమెకు ఆ పేరు స్థిరపడిపోయింది. డా విన్సీ చిత్రించిన మోనాలిసా ఎంతటి ఆకర్షణీయమైనదో.. ఈ ఆధునిక మోనాలిసా కథ కూడా అంతే ఆసక్తికరంగా మారింది. ఒక కళాఖండం గోడలపై పరిమితమైతే.. ఈ జీవకళాఖండం తన శ్రమతో బతుకు దెరువు వెతుక్కుంటోంది.
సాధారణంగా డబ్బు సంపాదన అధికంగా ఉంటే చాలామంది చదువును, సంస్కారాన్ని మర్చిపోతారు. కానీ మోనాలిసా విషయంలో ఆమె తండ్రి తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం. జనం ఎగబడటంతో భద్రతా కారణాల రీత్యా ఆమెను కుంభమేళా నుండి ఇంటికి తీసుకెళ్లడమే కాకుండా.. ఐదవ తరగతితో ఆగిపోయిన ఆమె చదువును తిరిగి ప్రారంభించేలా చేశారు. ముంబైలో నటనలో శిక్షణ పొందుతున్నప్పటికీ.. ఆమె తన పాత ప్రభుత్వ పాఠశాలకే వెళ్లి చదువుకోవడం ఆమెలోని వినయానికి నిదర్శనం.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆమె ఎంత సంపాదించినా.. ఎన్ని ఖరీదైన కార్లలో తిరిగినా.. వారి తల్లిదండ్రులు మాత్రం వృత్తిని వదిలి పెట్టలేదు. తండ్రి రైతుగానే కొనసాగుతుండగా.. తల్లి మాత్రం అలంకరణ వస్తువులను తయారు చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే.. తన సంపాదనతో తల్లిదండ్రులకు ఒక సొంత ఇల్లు నిర్మించి ఇచ్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.