|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 07:26 PM
రెండేళ్లుగా అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ మీడియా సమావేశంలో మాత్రం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు.ఖమ్మం జిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.తమ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం ప్రతి సంవత్సరం రూ.12,500 కోట్లు విద్యుత్ శాఖకు ప్రభుత్వం చెల్లిస్తోందని భట్టివిక్రమార్క తెలియజేశారు. బీఆర్ఎస్ నాయకులు తోలు తీస్తామంటూ దిగజారి మాట్లాడుతున్నారని, తాము వారిలా మాట్లాడలేమని పేర్కొన్నారు. అలా మాట్లాడే వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారని భట్టివిక్రమార్క అన్నారు.