|
|
by Suryaa Desk | Sat, Aug 23, 2025, 08:22 PM
మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ నగర శుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.375 కోట్ల నిధులు కేటాయిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగే అవకాశాలు మెరుగయ్యాయి. ఇప్పటికే నది పరివాహక ప్రాంతాల్లోని అనధికారిక నిర్మాణాలను తొలగించి, నదిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా.. నదికి అందాన్ని తీసుకురావడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి రూ.4,100 కోట్ల రుణానికి ఆమోదం లభించడం ప్రాజెక్టుకు మరింత బలాన్ని చేకూర్చింది.
నది రెండు వైపులా రోడ్లు, సైకిల్ ట్రాకులు..
ఈ ప్రాజెక్ట్లో భాగంగా నది రెండు వైపులా రోడ్లు, సైకిల్ ట్రాకులు, వాకింగ్ పాథ్లు, పార్కులు, పచ్చని ప్రదేశాలు ఏర్పాటు చేయనున్నారు. మూసీ నీటిలో కలిసే మలినాలు, వరద నీటిని వేరు చేయడానికి ఇంటర్సెప్టర్ ఛానెల్ నెట్వర్క్ నిర్మాణం చేపడుతున్నారు. దీని ద్వారా నది శాశ్వతంగా పరిశుభ్రంగా ఉంచే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధిలో మూసీ ప్రక్షాళన కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందుతుందని ఆయన అన్నారు. మూసీ శుభ్రతతో నగర వాతావరణం మెరుగవడమే కాకుండా.. పర్యాటక రంగానికి కూడా ఇది కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందని సీఎం వ్యాఖ్యానించారు.
పర్యావరణ నిపుణులు కూడా ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారు. శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించే ఈ శుభ్రత, సుందరీకరణ కార్యక్రమం ద్వారా ప్రజలకు విశ్రాంతి, వినోదం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేలా మారుతుందని వారు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే.. భవిష్యత్తులో మూసీ హైదరాబాదుకు ఒక ప్రతీకగా నిలుస్తుందని నిపుణుల అంచనా వేస్తున్నారు. వీటితో పాటు.. స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.