![]() |
![]() |
by Suryaa Desk | Fri, May 23, 2025, 08:26 PM
తెలంగాణలో సమీర్ ఉగ్ర కుట్ర కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని డీజీపీ జితేందర్ వెల్లడించారు. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల గురించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో స్లీపర్ సెల్స్ను గుర్తించి, వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.సమీర్ ప్రధాన సూత్రధారిగా ఉన్న ఉగ్ర కుట్ర కేసులో లోతైన విచారణ జరుగుతోందని డీజీపీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి ప్రయత్నాన్ని అయినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. "ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఆ బృందం ఇంకా ఏర్పాటు దశలో ఉండగానే పసిగట్టి, దానిని విచ్ఛిన్నం చేశాం" అని డీజీపీ వివరించారు. ఇలాంటి కుట్రలను మొగ్గలోనే తుంచివేసేందుకు నిఘా వ్యవస్థ నిరంతరం పనిచేస్తోందని ఆయన తెలిపారు.ఇదే సందర్భంలో, ఛత్తీస్గఢ్లో జరిగిన ఆపరేషన్ గురించి ప్రస్తావిస్తూ, ఆ కార్యక్రమాన్ని పూర్తిగా కేంద్ర బలగాలు నిర్వహించాయని డీజీపీ జితేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిందని అన్నారు. ఇప్పటివరకు సుమారు 300 మంది మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తున్న వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. మావోయిస్టులు వెంటనే లొంగిపోయి ప్రశాంతమైన జీవితం గడపాలని డీజీపీ పిలుపునిచ్చారు.