|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 06:21 PM
రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబుకు కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించిన వివాదంలో నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. ఆయనతో పాటు మరో 12 మంది కాంగ్రెస్ నాయకులపై 2017లో నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం మంత్రి శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతూ, ఇది రైతుల విజయమని, చివరికి న్యాయమే గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు. 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూసేకరణపై ప్రజా విచారణ జరుగుతున్న సమయంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన తాము నిలిచామని మంత్రి శ్రీధర్బాబు గుర్తుచేశారు. "రైతుల హక్కులను కాపాడాలని, వారికి న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు వెళితే, అప్పటి ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాపై వివిధ సెక్షన్ల కింద కేసులు బనాయించింది" అని ఆయన వివరించారు.దాదాపు ఎనిమిదేళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగిందని, తాజాగా నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేయడం సంతోషకరమని శ్రీధర్బాబు తెలిపారు.