|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 06:15 PM
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి, ఆ దేశ నిజస్వరూపాన్ని బహిర్గతం చేయనుంది కేంద్రం. ఇందులో భాగంగా మొత్తం ఏడు బృందాలను ఏర్పాటు చేయగా, అన్ని పార్టీలకు చెందిన ఎంపీలకు వీటిలో స్థానం కల్పించారు. మే 22, 23 తేదీల్లో ఈ బృందాలు విదేశాలకు బయలుదేరనున్నాయి. ఈ బృందాలు యూకే, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ దేశాల్లో పర్యటించనున్నాయి. తెలంగాణ నుంచి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కూడా ఒక బృందంలో చోటు దక్కింది. ఆయన బీజేపీ నేత బైజయంత్ జే పాండా నేతృత్వంలోని బృందంలో సభ్యుడిగా వ్యవహరించనున్నారు. ఈ బృందంలో నిషికాంత్ దుబే, ఫంగ్నోన్ కొన్యాక్, రేఖ శర్మ, సత్నామ్ సింగ్ సంధు, గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. వీరు యూకే, ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ అవకాశంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, "ఇది దేశానికి సంబంధించిన ముఖ్యమైన బాధ్యత. పాకిస్థాన్ ఉగ్రవాదానికి మద్దతిస్తున్న తీరును అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం. కేంద్ర ప్రభుత్వం అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడానికి నా వంతు కృషి చేస్తాను. అంతర్జాతీయ స్థాయిలో పాక్ నిజస్వరూపాన్ని బయటపెడతాం" అని తెలిపారు.