|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 07:31 PM
తెలంగాణలో భూభారతి చట్టం అమల్లోకి వచ్చినా.. వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములపై పట్టాలు జారీ చేసే ప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రెవెన్యూ అధికారులు సరైన పత్రాలు లేకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, సంతకాల విషయంలో ఉత్పన్నమవుతున్న వివాదాలతో తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. వీటి కారణంగానే వారసత్వ భూములకు పట్టాలు ఇవ్వలేకపోతున్నారు. గత మేలో ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ భూములకు సంబంధించి మొత్తం 6,106 దరఖాస్తులు అందగా.. ఇప్పటికీ 4,047 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అంటే సగం కంటే ఎక్కువ సమస్యలు పరిష్కారం దొరకక చట్టం అమలు కష్టంగా మారింది.
ప్రధాన సమస్య ఆడపిల్లల హక్కుల వద్దే మొదలవుతోంది. చట్టప్రకారం సోదరులు భూమి పంచుకున్నా, చెల్లెల్లు కూడా వాటాదారులుగా సంతకాలు చేయాలి. పెళ్లి సమయంలో తండ్రి ఇచ్చిన ఆభరణాలు, నగదు సరిపోతుందని అన్నదమ్ములు వాదిస్తుండగా.. ఆడపిల్లలు భూమిలోనూ తమకు వాటా ఉండాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదం పరిష్కారం కానందున అధికారులు పట్టాదారు పాస్బుక్స్ జారీ చేయలేకపోతున్నారు.
ఇంకో పెద్ద సమస్య అన్నదమ్ముల మధ్య ఆర్థిక విభేదాలు. ఒకరికి చదువు, వ్యాపారం కోసం ఎక్కువ ఖర్చు చేశారని వాదనలు రావడం వల్ల ఆస్తి పంపకం నిలిచిపోతోంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు తామే మినహాయించుకోవాలని ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఇతరులు అంగీకరించడం లేదు. మరణ ధ్రువీకరణ పత్రాల లేమి కూడా ఒక ప్రధాన ఆటంకం. తండ్రి, తల్లి లేదా తాత మరణ ధ్రువీకరణ లేకుండా వారసత్వ భూములపై హక్కు నిర్ధారణ జరగదు.
ఇవి ఆర్డీవో స్థాయిలో జారీ చేయించుకోవడం కష్టతరం కావడంతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఆస్తి హక్కులపై స్పష్టమైన చట్టబద్ధ నిర్ణయం తీసుకోకపోతే.. రైతులు భూసంబంధ సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీని ఫలితంగా వ్యవసాయం, రుణాలు, సబ్సిడీలు, పంట బీమా వంటి అనేక రంగాల్లో సమస్యలు మరింత పెరుగుతున్నాయి. పట్టా పాస్ పుస్తకాలు జారీ అయితే ఇటు రైతు భరోసాతో పాటు.. అటు పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా పెట్టుబడి సాయం పొందే అవకాశం ఉంటుంది.