|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 08:07 PM
తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెలాఖరు నుంచి వరి కోతలు మొదలు కానున్న నేపథ్యంలో.. అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోలు ప్రక్రియ నాలుగు నెలల పాటు కొనసాగనుంది. ముఖ్యంగా సన్నధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ అందించాలని నిర్ణయించింది.
రైతుల సౌకర్యం కోసం ఈసారి కొనుగోలు కేంద్రాల సంఖ్యను గణనీయంగా పెంచారు. గత ఖరీఫ్లో 7,139 కేంద్రాలు ఉండగా.. ఈసారి వాటి సంఖ్యను 8,332కి పెంచారు. సన్నధాన్యానికి బోనస్ ఇవ్వడం వల్ల సాగు విస్తీర్ణం 60.39 లక్షల ఎకరాల నుంచి 65.96 లక్షల ఎకరాలకు పెరిగింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఇప్పటికే వ్యవసాయం, రవాణా, పోలీసులతో సహా ఎనిమిది శాఖలతో సమీక్ష నిర్వహించి కొనుగోళ్ల కార్యాచరణను ఖరారు చేశారు.
గతేడాది ధాన్యం ఉత్పత్తి 146.28 లక్షల టన్నులు కాగా.. ప్రభుత్వం 91.28 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. అయితే ఈ ఏడాది ఉత్పత్తి అంచనా 159.14 లక్షల టన్నులు ఉన్నప్పటికీ.. కొనుగోలు లక్ష్యాన్ని 74.99 లక్షల టన్నులకు పరిమితం చేశారు. రైతుల నుంచి వచ్చే ధాన్యాన్ని సజావుగా కొనుగోలు చేసేందుకు సన్న, దొడ్డు రకాలకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయం రైతుల కష్టాలకు తగ్గ ఫలితం లభించేలా చూస్తుంది.
రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ధాన్యం నిల్వ, రవాణా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పౌరసరఫరాల సంస్థ ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకల్లా వాతావరణ అంచనాలను జిల్లాలకు, అక్కడి నుంచి కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జులకు, రైతులకు చేరవేయాలని సూచించింది. కేంద్రాల వద్ద ధాన్యం రాశులను తడిచిపోకుండా టార్పాలిన్ కవర్లతో కప్పాలని, తూకం వేసిన సంచులను సైతం కంటైనర్ల వంటి వాటిలో నిల్వ చేసి సురక్షితంగా ఉంచాలని ఆదేశించారు.